తెలంగాణలో ఏర్పడేది డబుల్ ఇంజిన్ సర్కారే: రాంచందర్ రావు
- తెలంగాణలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందన్న రాంచందర్ రావు
- చదువుకున్న యువత పార్టీలో చేరుతున్నారని వెల్లడి
- సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్య
తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ నేతృత్వంలో ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పాటు కావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ తెలంగాణలో బీజేపీ క్రమంగా బలోపేతం కావడం శుభపరిణామమని, చదువుకున్న యువత పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరుతుండటం మార్పుకు సంకేతమని పేర్కొన్నారు.
సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఆయన... అనేక దేశాలు క్రిస్టియన్, ముస్లిం దేశాలుగా మారినా సనాతన ధర్మాన్ని ఏ శక్తీ నిర్మూలించలేకపోయిందని అన్నారు. ప్రస్తుతం యువజన ఉద్యమాల ముసుగులో విదేశీ నిధులు సేకరిస్తూ దేశాన్ని విభజించేందుకు కొన్ని కుట్రలు సాగుతున్నాయని, దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రతి పదేళ్లకు ఒకసారి సాధారణంగా జరిగే ప్రక్రియ మాత్రమేనని, దీనిని అడ్డుపెట్టుకుని అనవసర భయాందోళనలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి ఒడిదుడుకులను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.