మీ ఓటు వివరాలు సరిచూసుకోండి.. తెలంగాణలో మొదలైన ఇంటింటి ఓటర్ల సర్వే
- తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం
- ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరించనున్న 36,000 మంది బీఎల్ఓలు
- దాదాపు 90 లక్షల ఓటర్ల వివరాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తింపు
- ఆన్లైన్లో కూడా వివరాలు సరిచేసుకునేందుకు ఓటర్లకు అవకాశం
- అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితా వెల్లడి
ఇలా సాగనుంది సర్వే ప్రక్రియ
ఈ కార్యక్రమంలో భాగంగా, బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) వారం రోజుల పాటు ప్రతి ఇంటికీ వెళ్లి ముందుగా ముద్రించిన ఓటరు ఫారాలను పంపిణీ చేస్తారు. ఈ ఫారాలు ఒరిజినల్, డూప్లికేట్ కాపీలతో ఉంటాయి. ఓటర్లు తమకు అందిన ఫారంలోని ఒరిజనల్ కాపీలో వివరాలను నింపి, బీఎల్ఓలు రెండోసారి వచ్చినప్పుడు వారికి అందజేయాలి. ఫారం స్వీకరించిన తర్వాత బీఎల్ఓలు ఓటర్లకు రసీదు ఇస్తారు. డూప్లికేట్ కాపీని ఓటర్లు తమ వద్ద ఉంచుకోవాలి. సర్వే సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఉంటే, ఫారమ్ను తలుపు వద్ద ఉంచి వెళ్తారు. ఓటరు అందుబాటులో లేకపోతే, కుటుంబంలోని పెద్దవారికి ఫారం అందజేస్తారు. ప్రతి బీఎల్ఓ సుమారు 800 నుంచి 1,000 మంది ఓటర్ల వివరాలను పర్యవేక్షిస్తారు.
ఆన్లైన్ సేవలు, కీలక సూచనలు
ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్లో కూడా సరిచేసుకోవచ్చని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈసీఐ యాప్ ద్వారా గానీ, voters.eci.in వెబ్సైట్లో గానీ ఫారాలను సమర్పించవచ్చని సూచించారు. ఆన్లైన్లో సమర్పించిన ఫారాలు నేరుగా సంబంధిత పోలింగ్ స్టేషన్ లేదా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ)కు చేరుతాయి. ఒకవేళ బీఎల్ఓలు ఇంటికి రాకపోయినా, ఫారం అందకపోయినా.. ceotelangana.nic.in వెబ్సైట్లోని ఫోన్ నంబర్ల ద్వారా లేదా ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ’ సదుపాయం ద్వారా వారిని సంప్రదించవచ్చు. ఈ సర్వే సందర్భంగా ఓటర్ల నుంచి ఎలాంటి పత్రాలు సేకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.
90 లక్షల ఓట్లలో లోపాల వల్లే..
రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో దాదాపు 90 లక్షల మంది ఓటర్ల వివరాల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భారీ వ్యత్యాసాల నేపథ్యంలోనే జాబితాను పూర్తిస్థాయిలో సరిదిద్దేందుకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ బృహత్తర ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36,000 మంది బీఎల్ఓలను నియమించారు. వీరి పనితీరును పర్యవేక్షించేందుకు 3,500 మంది సూపర్వైజర్లు, వారిపైన 1,000 మందికి పైగా సీనియర్ అధికారులు ఉంటారు.
ముఖ్యమైన తేదీలు
సర్వే ముగింపు: జులై 27
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: జులై 31
అభ్యంతరాల స్వీకరణ: జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు
అభ్యంతరాల పరిష్కారం: జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు
తుది ఓటర్ల జాబితా ప్రచురణ: అక్టోబర్ 1
ఈ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించి, తమ ఓటు వివరాలను కచ్చితంగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.