పొరపాటున పాక్ గగనతలంలోకి ఎయిరిండియా విమానం.. విచారణకు ఆదేశం
- పాకిస్థాన్ గగనతలంలోకి కొద్ది దూరం వెళ్లిన ఎయిరిండియా విమానం
- అమృత్సర్లో ల్యాండింగ్ సమయంలో పొరపాటున జరిగిన ఘటన
- అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడి
- 2025 ఏప్రిల్ నుంచి భారత విమానాలపై పాకిస్థాన్ నిషేధం
- నిషేధం కారణంగా భారత విమానయాన సంస్థలకు పెరుగుతున్న ఆర్థిక భారం
విమాన సిబ్బంది ఏఐ479 విమానాన్ని అమృత్సర్లో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, సాంకేతిక కారణాలతో గో-రౌండ్ చేయాల్సి వచ్చిందని, ఈ క్రమంలో పాక్ గగనతలంలోకి కొద్ది దూరం ప్రవేశించిందని సంస్థ తెలిపింది. ఈ ఘటనపై సంబంధిత నియంత్రణ సంస్థలకు సమాచారం అందించామని, సంస్థాగతంగా కూడా అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎయిరిండియా పేర్కొంది. ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
2025 ఏప్రిల్లో జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి, సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత పాకిస్థాన్.. భారత్కు చెందిన అన్ని రకాల సివిల్, మిలటరీ విమానాలపై తమ గగనతలాన్ని మూసివేసింది. ఈ నిషేధాన్ని నెలనెలా పొడిగిస్తూ వస్తోంది. ఇటీవలే ఈ నిషేధాన్ని జూలై 24 వరకు పొడిగించినట్లు పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. భారత్ కూడా పాక్ విమానాలపై ఇదే తరహా నిషేధాన్ని అమలు చేస్తోంది.
ఈ నిషేధం కారణంగా ఎయిరిండియా, ఇండిగో వంటి భారత విమానయాన సంస్థలు యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా దేశాలకు వెళ్లేందుకు సుదీర్ఘమైన, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరిగి సంస్థలపై కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతోంది.