డీటీవో వెంకన్న మృతిపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టిప్పర్ ఢీకొని డీటీఓ వెంకన్న దుర్మరణం
- విచారణ జరపాలంటూ రవాణాశాఖ జాయింట్ కమిషనర్కు రేవంత్ ఆదేశం
- వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) ఎం. వెంకన్న ఘోర మరణం చెందిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీటీఓ వెంకన్న మృతిపై సమగ్ర విచారణ జరపాలని రవాణాశాఖ జాయింట్ కమిషనర్ను సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
వెంకన్న మృతి పట్ల సంతాపం ప్రకటించిన సీఎం.. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డీటీఓ వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి అందాల్సిన అన్ని ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామన్నారు.
ప్రమాదం వివరాల్లోకి వెళితే... ఈ ఉదయం గణపురం మండలం చెల్పూరు శివారులో వాహనాలను తనిఖీలు చేస్తుండగా బొగ్గు లోడ్తో వెళుతున్న టిప్పర్ లారీ వెంకన్నపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.