సింహాచలం హోటల్ నుంచి భర్త జంప్.. రాధా గాయత్రి కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు!
- గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీచరణ్, రాధా గాయత్రి
- జూన్ 14న ఉత్తరాఖండ్ టూర్లో ఉండగా ముస్సోరి హోటల్లో రాధ మృతి
- ముక్కు నుంచి రక్తం వచ్చిన స్థితిలో శవమై కనిపించిన గాయత్రి
- గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్పై యూపీ, ముస్సోరిలో హత్య కేసు నమోదు
- మరణానికి కారణమయ్యే మందులు వాడినట్లు గుర్తింపు
- కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు
గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ మొదటి నుంచి అబద్ధాలు చెబుతూ పోలీసులను, భార్య కుటుంబ సభ్యులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ టూర్ ప్లాన్కు సంబంధించి మృతురాలి తండ్రి సుధాకర్ పోలీసులకు కీలక ఆధారాలు అందజేశారు. నిందితుడు తమకు కేవలం రిషికేశ్, హరిద్వార్ యాత్రల గురించే చెప్పాడని, ముస్సోరి వెళ్తున్నట్లు గానీ, అక్కడ బస చేస్తున్నట్లు గానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాచాడని ఆయన ఆరోపించారు. తాను స్వయంగా ముస్సోరి వెళ్లి, పోలీసులు, డెహ్రాడూన్ ఉన్నతాధికారులను కలిసి న్యాయం చేయాలని కోరారు. అలాగే కూతురు చనిపోయిన హోటల్ యాజమాన్యంతో మాట్లాడగా, అక్కడ ఎలాంటి మద్యం గానీ, మాదకద్రవ్యాలు గానీ సరఫరా చేయలేదని వారు స్పష్టం చేసినట్లు సుధాకర్ వెల్లడించారు.
దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవ చేసిన తన కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటని సుధాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతికి కారణమైన అల్లుడిపై కఠిన చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం ఆపనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదిక అత్యంత కీలకంగా మారనుంది. మరోవైపు, విశాఖపట్నంలోని సింహాచలంలో ఒక హోటల్ రూమ్లో బస చేసిన శ్రీచరణ్, తనపై ముస్సోరిలో హత్య కేసు నమోదైనట్లు తెలియడంతో అక్కడి నుంచి రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాడు. పరారైన నిందితుడి కోసం ఉత్తరాఖండ్, విశాఖపట్నం పోలీసులు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టారు.