భారత హాకీ చరిత్రలో మన్ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు
- అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు
- 413 మ్యాచ్లతో దిలీప్ టిర్కీ రికార్డును అధిగమించిన మన్ప్రీత్
- రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించిన హాకీ ఇండియా
ఈ చారిత్రక ఘనతను గుర్తించిన హాకీ ఇండియా.. మన్ప్రీత్ సింగ్ను అభినందించి, రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. పదిహేనేళ్లుగా భారత హాకీ జట్టుకు మన్ప్రీత్ గుండెకాయలా నిలుస్తున్నాడని, ఆయన నిలకడ అసాధారణమని కొనియాడింది. 2011లో 19 ఏళ్ల వయసులో భారత జట్టులోకి అడుగుపెట్టిన మన్ప్రీత్, టోక్యో, పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మన్ప్రీత్ ఐదో స్థానంలో నిలవడం విశేషం.
ఈ మైలురాయిపై మన్ప్రీత్ సింగ్ స్పందిస్తూ "భారత్ తరఫున ఇన్ని మ్యాచ్లు ఆడటం గర్వంగా ఉంది. ఈ విజయాన్ని నా సహచరులకు, కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నా" అని తెలిపాడు. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ కప్ గెలవాలనేదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశాడు.
హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ మాట్లాడుతూ "మన్ప్రీత్ అంకితభావం, నిలకడకు ఈ రికార్డు నిదర్శనం. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తి" అని పేర్కొన్నాడు. హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలా నాథ్ సింగ్ కూడా మన్ప్రీత్ను ప్రశంసించారు.