పశ్చిమాసియా ఉద్రిక్తతలు: తక్షణమే దాడులు ఆపాలన్న భారత్‌

West Asia tensions India calls for immediate halt to attacks
  • పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు
  • అంతర్జాతీయ సమాజానికి ఆందోళనకరమన్న భారత్‌
  • దాడులు ఆపాలని సూచన
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన
  • దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని హితవు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన క్షిపణి దాడులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళనకరంగా మారాయని కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇరు పక్షాలు తక్షణమే దాడులను ఆపి, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చింది.

ఈ ఘర్షణలకు ఇప్పటికే 100 రోజులు దాటిపోయాయని, దీనివల్ల అమాయక ప్రజలు అపారమైన మానసిక, శారీరక క్షోభను అనుభవిస్తున్నారని భారత్ పేర్కొంది. ఈ యుద్ధ ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని, దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని కోరింది.

మరోవైపు ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరడంతో ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు ఎవరూ ఇరాన్ ప్రాంతానికి ప్రయాణాలు చేయవద్దని సూచించాయి. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ పౌరులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని అత్యవసర అడ్వైజరీ ఇచ్చాయి. ఇప్పటివరకు సుమారు 2,361 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Go Back to Shorts
India
West Asia Tensions
Ministry of External Affairs
Iran Israel Conflict
Indian Travel Advisory
Global Energy Supply

More Telugu News