ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన!
- ట్రంప్ ఘాటు వ్యాఖ్యలను కొట్టిపారేసిన నెతన్యాహు
- వ్యూహాత్మక అంశాల్లోనే చిన్న విభేదాలని వివరణ
- కుటుంబ గొడవల్లాంటివేనని ఇజ్రాయెల్ ప్రధాని సమర్థన
- ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టీకరణ
అసలేం జరిగింది?
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన శాంతి చర్చలు నడుస్తున్న సమయంలో.. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లోని బీరూట్పై దాడులు జరిపాయి. దీనిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. ట్రంప్ ఫోన్ చేసి ‘‘నేనే లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి.. నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నీ చర్యల వల్ల ఇప్పుడు ప్రపంచమంతా నిన్ను, ఇజ్రాయెల్ను ద్వేషిస్తోంది’’ అని నెతన్యాహుపై గట్టిగా అరిచినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఆ తర్వాత ట్రంప్ కూడా దీనిపై స్పందిస్తూ.. తాను నెతన్యాహుపై కోపంగా లేనని, కానీ చర్చలు జరుగుతున్నప్పుడు దాడులు చేయడం వల్ల కాస్త ఇబ్బందిగా ఫీలయ్యానని సర్దిచెప్పుకున్నారు.
బలంగా మానసిక బంధం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘‘మేం ఉదయం పూట ఏదైనా విషయంలో విభేదించినా.. సాయంత్రానికల్లా ఇద్దరం ఏకతాటిపైకి వస్తాం’’ అని వెల్లడించారు. ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకోవడంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికీ ఒకే మాటపై ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్కు దొరికిన ‘‘గొప్ప స్నేహితుడు’’ ట్రంప్ అని, తామిద్దరం రెండు రోజులకు ఓసారి ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటామని చెప్పారు. కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్లో పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. బుధవారం ఇరాన్ దళాలు కువైట్పై కొత్తగా దాడులు చేయడం, హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా సైన్యం ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతంలో వాతావరణం మళ్లీ వేడెక్కింది.