రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్
- తమిళనాడులో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించిన టీవీకే
- కూటమి బంధాన్ని బలోపేతం చేసే దిశగా సీఎం విజయ్ నిర్ణయం
- అన్నాడీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
- కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా ప్రచారం
- జూన్ 18న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్నాడీఎంకే నేత సి.వి. షణ్ముగం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్, వీసీకే వంటి మిత్రపక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డీఎంకేతో పొత్తును వీడి టీవీకేకు మద్దతు పలికిన కాంగ్రెస్తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ డేటా అనలిటిక్స్ విభాగానికి ఛైర్మన్గా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సీఎం విజయ్తో మర్యాదపూర్వకంగా భేటీ కావడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.
టీవీకే, దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు లాంఛనప్రాయమే కానుంది. అభ్యర్థి ఎవరనే దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ కేటాయింపుతో ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే, కాంగ్రెస్కు పార్లమెంటు ఎగువ సభలో ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుంది.