బైక్ కొనివ్వలేదని ఘాతుకం.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య
- సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఈ ఘటన
- భార్య యాదమ్మను ఉరివేసి చంపిన భర్త అంజయ్య
- అనంతరం మామిడి చెట్టుకు ఉరేసుకుని అంజయ్య ఆత్మహత్య
- మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మారేపల్లి గ్రామానికి చెందిన దాసరి అంజయ్య (25), యాదమ్మ (20) దంపతులు. వీరికి 11 నెలల క్రితం వివాహమైంది. వీరు రాంపూర్ తండా రోడ్డులోని ఓ మామిడితోటలో నివసిస్తున్నారు. కొంతకాలంగా తనకు కొత్త మోటార్సైకిల్ కొనివ్వాలని అంజయ్య తన అత్తింటి వారిని డిమాండ్ చేస్తున్నాడు.
ఈ విషయమై శుక్రవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో అదుపుతప్పిన అంజయ్య, భార్య యాదమ్మను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అదే తోటలోని మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటనపై మృతురాలి తండ్రి సైలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సోమేశ్వరి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.