సెమీకండక్టర్ల రంగంలో చైనా గుత్తాధిపత్యానికి చెక్... చేతులు కలిపిన భారత్, అమెరికా
- కీలక ఖనిజాలపై భారత్, అమెరికా వ్యూహాత్మక ఒప్పందం
- చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యం
- క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఒప్పందంపై సంతకాలు
- సెమీకండక్టర్లు, ఈవీల తయారీలో ఈ ఖనిజాలు అత్యంత కీలకం
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కీలక ఖనిజాల సరఫరా గొలుసుపై చైనా గుత్తాధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఆ దేశం దీన్ని ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ తరుణంలో భారత్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. "కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడుల వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఇది చాలా సమయోచితమైన, కీలకమైన నిర్ణయం" అని తెలిపారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. "మనలాంటి ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థలు ఒకే దేశం గుత్తాధిపత్యానికి బలికాకూడదు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ" అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 4న జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరమ్లోనే ఈ ఒప్పందానికి పునాది పడిందని ఆయన గుర్తుచేశారు.