ఇక ఊరుకునేది లేదు... ఐపీఎల్ జట్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్

BCCI Issues Strong Warning to IPL Teams Regarding Protocol Violations
  • ఐపీఎల్ జట్లలో జరుగుతున్న అక్రమాలపై బీసీసీఐ సీరియస్
  • జట్లతో పాటు అనధికార వ్యక్తులు తిరుగుతున్నారని ఆందోళన
  • నిబంధనల కట్టడికి ప్రత్యేక అడ్వైజరీ జారీ చేయనున్నట్లు ప్రకటన
  • రాజస్థాన్ రాయల్స్ మేనేజర్, సంజూ శాంసన్ ఘటనల ప్రస్తావన
  • భవిష్యత్తులో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
ఐపీఎల్ జట్లు, ఆటగాళ్ల వెంట "అనధికార వ్యక్తులు" తిరుగుతున్నారనే నివేదికలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో బోర్డు చూస్తూ ఊరుకోబోదని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో వెలుగు చూసిన కొన్ని "అక్రమాలు, అవకతవకలను" అరికట్టేందుకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి ఒక సలహా మార్గదర్శకాన్ని (అడ్వైజరీ) జారీ చేయనున్నట్లు ఆయన గురువారం తెలిపారు.

"ఈసారి కొన్ని ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల విషయంలో అనేక అక్రమాలను మేము గమనించాం. అనధికార వ్యక్తులు జట్టు సభ్యులతో, జట్టు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కొందరు ఎలాంటి అనుమతి లేకుండా టీమ్ హోటళ్లకు, ఆటగాళ్లు లేదా అధికారుల గదులకు కూడా వస్తున్నారు. ఇది మా అవినీతి నిరోధక నిబంధనలకు పూర్తిగా విరుద్ధం" అని సైకియా వివరించారు.

గత నెలలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండుసార్లు వార్తల్లో నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గువాహటిలో మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడినందుకు టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌కు రూ. 1 లక్ష జరిమానా, హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే, పంజాబ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఈ-సిగరెట్ తాగడం) చేస్తూ కనిపించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.

జట్టు యజమానులు, అధికారులు కూడా ఆటగాళ్ల కోసం కేటాయించిన పరిమిత ప్రదేశాల్లోకి రావడంపై సైకియా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది "డగౌట్ పవిత్రతను", జట్టు వాతావరణాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. "కొన్ని నిబంధనల అమలులో నీరుగారిపోవడాన్ని మేము గమనించాం. ఈ విషయాలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం" అని ఆయన తెలిపారు.

"మేము ప్రస్తుతం ఒక అడ్వైజరీని జారీ చేస్తున్నాం. దీన్ని చాలా కఠినంగా అమలు చేస్తాం. ఇకపై ఎలాంటి ఉల్లంఘన జరిగినా, బీసీసీఐ, ఐపీఎల్ చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాయి. ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే, మేము ఎవరినీ వదిలిపెట్టం" అని సైకియా తేల్చిచెప్పారు.

ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఆటగాళ్ల గాళ్ ఫ్రెండ్స్ మైదానంలోకి అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇది నిబంధనల ఉల్లంఘనే అని బీసీసీఐ అంటోంది. 
Go Back to Shorts
BCCI
IPL
Devajit Saikia
IPL Teams
IPL Governing Council
Rajasthan Royals
Riyan Parag
Romee Bhender
IPL violations
Anti-Corruption Rules

More Telugu News