మాజీ స్పీకర్ కోడెల జయంతి.. నివాళులర్పించిన చంద్రబాబు!
- రూపాయి వైద్యుడిగా పేదలకు కోడెల సేవ చేశారన్న చంద్రబాబు
- రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారని కితాబు
- కోడెల లాంటి నాయకుడి సేవలు మరువలేనివని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి, దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోడెల సేవలను స్మరించుకుంటూ సీఎం ఎక్స్ వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.
వృత్తిరీత్యా వైద్యుడైన కోడెల, పేద ప్రజల పట్ల ఎంతో కనికరం చూపిస్తూ 'రూపాయి వైద్యుడి'గా సేవలందించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. కేవలం వైద్యుడిగానే కాకుండా, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోడెల... సంఘవిద్రోహ శక్తులు, ఫ్యాక్షనిస్టులకు భయపడకుండా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన ధీశాలి అని గుర్తు చేసుకున్నారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషిని, ఆయనకున్న దూరదృష్టిని ప్రశంసిస్తూ... కోడెల శివప్రసాదరావు లాంటి నాయకుడి సేవలు మరువలేనివని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.