బెంగాల్‌లో ముగిసిన చివరి దశ పోలింగ్... మే 4న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ

Bengal election second phase polling concluded
  • పశ్చిమ బెంగాల్‌లో ముగిసిన తుది విడత అసెంబ్లీ ఎన్నికలు
  • సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 89.90 శాతం ఓటింగ్ నమోదు
  • వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు ఘర్షణలు, పరస్పరం ఆరోపణలు
  • మే 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
  • మమతా బెనర్జీ, సువేందు అధికారి భవితవ్యంపై ఉత్కంఠ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 2026 తుది సమరం ముగిసింది. రాష్ట్రంలోని 142 నియోజకవర్గాలకు రెండో మరియు చివరి విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. కాగా, నేటి పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘర్షణలు జరిగాయి. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏకంగా 89.90 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల భవితవ్యం తేలనుంది.

తృణమూల్ కాంగ్రెస్‌కు సాంప్రదాయకంగా బలమైన దక్షిణ బెంగాల్, కోల్‌కతా ప్రాంతాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. 2021లో ఈ 142 స్థానాల్లో టీఎంసీ 123 సీట్లు గెలుచుకోవడంతో, ఈసారి కూడా అదే ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 2,400 కంపెనీలకు పైగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించింది.

భబానీపూర్‌పైనే అందరి దృష్టి

ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం భబానీపూర్. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో హోరాహోరీ పోరు నెలకొంది. వీరితో పాటు టీఎంసీ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిస్వాస్, శశి పాంజా వంటి ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభిషేక్ బెనర్జీ, మిథున్ చక్రవర్తి, మహువా మొయిత్రా వంటి ప్రముఖ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఘర్షణలు, ఆరోపణలు

ఎన్నికల సందర్భంగా నదియా జిల్లాలోని చాప్రా, శాంతిపుర్, భాంగర్, హూగ్లీలోని ఖానాకుల్ వంటి ప్రాంతాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు, కేంద్ర సాయుధ బలగాలు, ఎన్నికల పరిశీలకులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, బయటి వ్యక్తులు పోలింగ్ బూత్‌లలోకి చొరబడుతున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సయయంలో, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత ఎలాంటి భయాలకు తావివ్వకుండా రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Bengal Elections
Second Phase
Assembly Polls
West Bengal

More Telugu News