ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి: షర్మిల
- సమీక్షలు, సలహాలతో ఇంధన కొరత తీరదన్న షర్మిల
- రాష్ట్రంలో 70 శాతం బంకులు మూతపడ్డాయని వ్యాఖ్య
- కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యమని ఆరోపణ
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్రంగా స్పందించారు. కేవలం సమీక్షలు, సలహాలతో ఇంధన కొరత తీరదని, 24 గంటల డెడ్ లైన్తో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 70 శాతం బంకులు మూతపడటం అత్యంత దారుణమని, దీనిని అత్యవసర పరిస్థితిగా గుర్తించి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
"దేశంలో ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. ప్రజలను ఎర్రటి ఎండలో కిలోమీటర్ల మేర నిలబెట్టడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనం" అని షర్మిల మండిపడ్డారు. మోదీకి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టినా రాష్ట్రానికి ఇంధన కష్టాలు రావడం బాధాకరమన్నారు. ఇంధన కొరత వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలని హెచ్చరించారు.