Jagan Mohan Reddy: జగన్ జీవితం జంగిల్ బుక్ లాంటిది: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

BC Janardhan Reddy Criticizes Jagans Jungle Book Life
షార్ట్స్‌లో చూడండి
వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జీవితం 'జంగిల్ బుక్'లా మారిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. అరాచకం, అబద్ధాలు తప్పించి వాస్తవాలను ఏనాడూ మాట్లాడని నాయకత్వం ఆయనదేనని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, ప్రజా ధనం దోపిడీ చేసి రాష్ట్రాన్ని దెబ్బతీశాడని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆయనకు గట్టి బుద్ధి చెప్పి కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారని అన్నారు.

ప్రజా తీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం ఆయన బలహీనతకు నిదర్శనమని అన్నారు. గతంలో ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం వంటి ప్రముఖ కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసింది నాటి జగన్ ప్రభుత్వమేనని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితులను మార్చి గూగుల్, టీసీఎస్, అర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్, ఐబీఎం వంటి ప్రతిష్ఠా త్మక సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తోందని పేర్కొన్నారు.

ఇది తమ ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని మంత్రి అన్నారు. జగన్ పాలనలో చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తూ పెట్టుబడులకు స్వర్గధామిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలుపుతోందని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు లభిస్తున్న ఉపాధి అవకాశాలు, వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

అందుకే ప్రతిసారి గుమ్మం కూడా దాటకుండా ఇంట్లో ప్రెస్ మీట్ ద్వారా లేదా తన పార్టీ నేతలతో సమావేశమై కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలు చేసినా ప్రజలు తమ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందని జనార్ధన్ రెడ్డి అన్నారు.
Go Back to Shorts
Jagan Mohan Reddy
BC Janardhan Reddy
Andhra Pradesh
YSRCP
Telugu Desam Party
AP Politics

More Telugu News