Narendra Modi: పశ్చిమాసియా సంక్షోభంతో భారత్‌కు ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి: ప్రధాని మోదీ

Narendra Modi West Asia Crisis Poses Unexpected Challenges for India
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా భారత్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ యుద్ధం గల్ఫ్ దేశాల్లోని భారతీయులపై, దేశ వాణిజ్యంపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ సంక్షోభంపై విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇప్పటికే సభకు వివరించారని గుర్తుచేశారు. ఈ సంక్షోభానికి త్వరగా పరిష్కారం కనుగొనాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయని తెలిపారు.

ఇంధన సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు

భారత్‌కు అవసరమైన ముడిచమురు, గ్యాస్, ఎరువులు వంటివి పెద్ద మొత్తంలో హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. యుద్ధం కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు సవాలుగా మారాయని అన్నారు. "అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడకుండా మా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది" అని ఆయన వివరించారు. దేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటున్నందున, సరఫరాలో అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని దేశీయ వినియోగదారులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని కూడా పెంచుతున్నట్లు చెప్పారు.

వ్యూహాత్మక చర్యలతో పెరిగిన ఇంధన భద్రత

గత 11 ఏళ్లలో ఇంధన భద్రత కోసం తమ ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యలను ప్రధాని మోదీ వివరించారు. గతంలో కేవలం 27 దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్‌జీ, ఎల్పీజీ వంటివి దిగుమతి చేసుకోగా, నేడు 41 దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయికి చేరామని తెలిపారు. సంక్షోభ సమయాల కోసం ముడి చమురు నిల్వలకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రస్తుతం దేశంలో 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. దీనిని 64 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెంచేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. 

ఇవి కాకుండా ఆయిల్ కంపెనీల వద్ద ఉండే నిల్వలు అదనమని అన్నారు. చమురు, గ్యాస్ సరఫరాలు నిరంతరాయంగా కొనసాగేలా వివిధ దేశాలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, గల్ఫ్, ఇతర సముద్ర మార్గాలను నిశితంగా గమనిస్తున్నామని మోదీ పేర్కొన్నారు.

పరిస్థితులు ఆందోళనకంగా ఉన్నాయి

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంక్షోభం భారత్‌కు ఆర్థిక, జాతీయ భద్రత, మానవతా పరమైన సవాళ్లను సృష్టిస్తోందని వివరించారు. "యుద్ధంలో చిక్కుకున్న దేశాలతో, దాని ప్రభావానికి గురైన దేశాలతో భారత్‌కు విస్తృతమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మనకు అవసరమైన ముడి చమురు, గ్యాస్‌లో సింహభాగం ఈ ప్రాంతం నుంచే దిగుమతి అవుతోంది. ఇతర దేశాలతో మన వాణిజ్యానికి ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన మార్గం కూడా. అందువల్ల, ఈ యుద్ధం మనపై తీవ్ర ప్రభావం చూపుతోంది" అని మోదీ పేర్కొన్నారు. 

పశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయులు నివసిస్తూ, పనిచేస్తున్నారని, అలాగే వాణిజ్య నౌకల్లో పనిచేసే భారత సిబ్బంది సంఖ్య కూడా చాలా ఎక్కువని, ఈ కారణాల వల్ల భారత్ ఆందోళన సహజంగానే ఎక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రవాస భారతీయుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం

సంక్షోభ ప్రాంతాల్లోని భారతీయుల భద్రత, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. "యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభావిత దేశాల్లోని ప్రతి భారతీయుడికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాం. నేను స్వయంగా రెండు దఫాలుగా చాలా పశ్చిమాసియా దేశాల అధినేతలతో ఫోన్‌లో మాట్లాడాను. భారతీయులకు పూర్తి భద్రత కల్పిస్తామని వారంతా హామీ ఇచ్చారు" అని తెలిపారు. దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గాయపడ్డారని చెబుతూ, వారి కుటుంబాలకు అవసరమైన మద్దతు అందిస్తున్నామని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నామని వివరించారు. 

ఇప్పటికే 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని, ఒక్క ఇరాన్ నుంచే 700 మంది మెడికల్ విద్యార్థులతో సహా వెయ్యి మంది వచ్చారని తెలిపారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయ పాఠశాలల్లో 10, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిందని, విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

రైతులపై ప్రభావం పడకుండా చర్యలు

పశ్చిమాసియా సంక్షోభం రైతులపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. "రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు దేశంలో పుష్కలంగా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు వేయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. గత కొన్నేళ్లుగా మేం తీసుకున్న చర్యల వల్ల వివిధ మార్గాల్లో ఎరువుల దిగుమతి సాధ్యమైంది. రైతులకు 'మేక్ ఇన్ ఇండియా' ఎరువుల ప్రత్యామ్నాయాన్ని కూడా ఇచ్చాం" అని ఆయన వివరించారు. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రైతులకు 22 లక్షలకు పైగా సోలార్ పంపులను అందజేసినట్లు గుర్తుచేశారు.

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రత్యామ్నాయాలు

ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇథనాల్ బ్లెండింగ్‌పై భారత్ దృష్టి సారించడం సత్ఫలితాలనిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. "ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా మనం ఇప్పుడు ఏటా 4.5 కోట్ల బ్యారెళ్ల చమురు దిగుమతిని ఆదా చేస్తున్నాం" అని వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు 15,000 ఈ-బస్సులను అందజేశామని తెలిపారు. 

పశ్చిమాసియా ఇంధన అవసరాలకు ప్రధాన వనరు అయినప్పటికీ, అక్కడి అంతరాయాల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు చాలా బలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రసాయనాలు, ఫార్మా, పెట్రోకెమికల్స్ వంటి రంగాలకు అవసరమైన దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ వనరులను అన్వేషిస్తున్నట్లు, అలాగే భారతీయ వస్తువులను ప్రోత్సహించడానికి కొత్త ఎగుమతి మార్గాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
Narendra Modi
West Asia crisis
India
economy
oil imports
Indian diaspora
fertilizers
ethanol blending
Gulf countries
trade

More Telugu News