Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి: నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

Polavaram Project is Lifeline for Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేదని, వరద నీటిలో ప్రజలు మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసితులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఇళ్లను, భూములను త్యాగం చేశారని అన్నారు. ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వాసితుల ఖాతాల్లో రూ.226 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఉగాది తర్వాత రెండు నెలల్లో పోలవరం సాకారమవుతుందని హామీ ఇచ్చారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని ఆరోపించారు. నిపుణులతో అధ్యయనం చేయించి తిరిగి కొత్త నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. వారం రోజుల్లో ఇది పూర్తవుతుందని తెలిపారు. 21 నెలల్లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2025లో సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు, దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు.

మూడో విడతతో కలిపి, 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు మొత్తం రూ.1943.53 కోట్లను చెల్లించామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాజెక్టు రెండు దశలుగా నిర్మితమవుతోందని తెలిపారు. తొలిదశలో 38,068 మంది నిర్వాసితులు ఉన్నట్లు వెల్లడించారు. 75 నిర్వాసిత కాలనీలలో ఇప్పటికే 26 పూర్తయ్యాయని, మిగిలిన49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వీటి నిర్మాణం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అన్నారు.

ప్రతి నిర్వాసితుడికి రూ.3.5 లక్షల మేర ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నామని, ఇంటి స్థలం కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోందని అన్నారు. నిర్వాసితులకు పారదర్శకంగా చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించారు. దళారులను నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి సూచించారు.

గోదావరి పుష్కరాలు మూడోసారి నిర్వహించే గౌరవం తనకు దక్కిందని ముఖ్యమంత్రి అన్నారు. పుష్కరాల నిర్వహణ కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు ప్రారంభాని కంటే ముందే నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులంతా ప్రజల హృదయాల్లో నిలుస్తారని అన్నారు. నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలమే పోలవరం ప్రాజెక్టు అన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు ఆరేడేళ్లు ఆలస్యమైందని అన్నారు. నిర్వాసితులంతా సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Polavaram Project
Andhra Pradesh
Irrigation Project
Resettlement Package

More Telugu News