Payyavula Keshav: గ్యాస్ సరఫరా, వినియోగంపై పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

Payyavula Keshav on Gas Supply and Usage in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, వినియోగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇకపై తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే జరగాలని, దీనివల్ల బ్లాక్ మార్కెటింగ్‌ను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 88 శాతం మంది వినియోగదారులు ఓటీపీ ద్వారా సిలిండర్లు తీసుకుంటున్నారని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు విధించినట్టు తెలిపారు. డబుల్ సిలిండర్ ఉన్న వారికి 32 రోజుల చొప్పున రీఫిల్ బుకింగ్‌పై పరిమితి విధించినట్లు మంత్రి వివరించారు.


ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ... ఆసుపత్రులు, హాస్టళ్లు, గృహ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని పయ్యావుల కేశవ్ తెలిపారు. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రిఫైనరీలను ఆదేశించిందని, ప్రస్తుతం 10 నుంచి 20 శాతం వరకు ఉత్పత్తి మన దేశంలోనే జరుగుతోందని వెల్లడించారు. హోటల్ అసోసియేషన్లతో కూడా చర్చలు జరుపుతున్నామని, వారు బొగ్గుతో నడిచే తందూరి బట్టీల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని చెప్పారు. సోలార్ కుకింగ్ విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే స్టీమ్ కుకింగ్ అమలులో ఉందని ఆయన గుర్తుచేశారు.


రాష్ట్రంలో గ్యాస్ ధరలు పెరగకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆర్‌టీజీఎస్ ద్వారా అన్ని బృందాలతో సమావేశమై గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించనున్నారని వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Payyavula Keshav
Andhra Pradesh gas supply
gas cylinder booking
online gas booking
gas black marketing
LPG subsidy
Chandrababu Naidu
gas price control
solar cooking
gas production

More Telugu News