Chandrababu Naidu: ప్రభుత్వం పని చేసేది బిలియనీర్ల కోసం కాదు: చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu Says Government Works for Poor Not Billionaires
  • అమరావతి చెట్లు, పూలతో రమణీయంగా ఉందన్న ముఖ్యమంత్రి
  • పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ ఉండాలన్న ముఖ్యమంత్రి
  • ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పని చేస్తుందన్న చంద్రబాబునాయుడు
మన ప్రభుత్వం పనిచేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా చెట్లు, పూలతో రహదారులు అత్యంత రమణీయంగా ఉన్నాయని, ఇతర ప్రాంతాల్లో కూడా అందంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా గణనీయంగా పెరగాలని అన్నారు. డిజిటల్ లిటరసీని పెంచాలని ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుందామని సూచించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

సెప్టెంబర్‌లో ప్రాజెక్టులు పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు అందరిముందు పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. అందుకు అనుగుణంగానే కలెక్టర్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులన్నీ వచ్చే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని పేర్కొన్నారు. మార్చి 23వ తేదీన ఆర్సెలార్మిట్టల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.

రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 2028 మార్చిలోగా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు పారిశ్రామిక క్లస్టర్లుగా తయారు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్థంగా వెళ్లాలని కలెక్టర్లకు సూచించారు.

పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై చర్చ జరగాలని చంద్రబాబునాయుడు అన్నారు. పీ4 కూడా ఒక గేమ్ ఛేంజర్ అని, కానీ రావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కలెక్టర్లు పీ4ను మానిటర్ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 2047 నాటికి రూ.55 లక్షల తలసరి ఆదాయం మన లక్ష్యమని అన్నారు.

ప్రభుత్వం పని చేసేది మిలియనీర్లు లేదా బిలియనీర్ల కోసం కాదని పేదల అభ్యున్నతి కోసమని ముఖ్యమంత్రి అన్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు స్వయం బ్రాండ్‌తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టాలని అన్నారు. ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రులు వేర్వేరు దేశాల్లో విస్తరించి ఉన్నారని అన్నారు. కొన్ని ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే, గుడ్లు, అరటి పండు లాంటి ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని అన్నారు. ప్రత్యామ్నాయ మార్కెట్లకు మన ఉత్పత్తులు చేరుకోవాలని అన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
District Collectors Conference
Data Driven Governance
Artificial Intelligence

More Telugu News