Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్పై చీటింగ్ కేసు: చర్చి ట్రస్ట్ పేరుతో రూ. 25 లక్షల మోసం
- చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం రూ. 25 లక్షలు తీసుకున్న నందిగం సురేశ్
- డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించారంటూ ట్రస్ట్ సభ్యుడి ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన విజయవాడ, సూర్యారావుపేట పోలీసులు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరోసారి చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. చర్చి ట్రస్ట్ పునరుద్ధరణ పేరుతో భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కేసు వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన సీబీఎన్సీ (CBNC) చర్చి ట్రస్ట్ సభ్యులు, దాని రెన్యువల్ కోసం 2021లో అప్పటి ఎంపీ నందిగం సురేశ్ను ఆశ్రయించారు. ఈ పని పూర్తి చేయడానికి సురేశ్ రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని, ఆ మేరకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసంలో నగదు అందజేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా పని పూర్తి కాకపోవడంతో పాటు, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆయన తమను బెదిరింపులకు గురిచేశారని ట్రస్ట్ సభ్యుడు ఆరోపించారు.
బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన సూర్యారావుపేట పోలీసులు, మాజీ ఎంపీపై సెక్షన్ 318(4) (చీటింగ్), 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే అమరావతి భూముల వ్యవహారం, గతంలో జరిగిన దాడుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని, జైలు నుంచి విడుదలైన నందిగం సురేశ్కు, ఈ తాజా చీటింగ్ కేసు రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది.