Sahibzada Farhan: సెంచరీ కొట్టినా దక్కని ప్రశంసలు: పాక్ ఓపెనర్‌పై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్

Sahibzada Farhan Century Draws Criticism From Irfan Pathan
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (100*) అద్భుత శతకంతో మెరిశాడు. అయితే, జట్టు స్కోరు కంటే తన వ్యక్తిగత మైలురాయికే ప్రాధాన్యం ఇచ్చాడంటూ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర విమర్శలు చేశాడు. 

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో ఈ వివాదం చోటుచేసుకుంది. రెండో బంతికి 99 పరుగుల వద్ద ఉన్న ఫర్హాన్, భారీ షాట్ ఆడకుండా బంతిని నెమ్మదిగా లాంగ్-ఆన్ వైపు ఆడి సింగిల్ పూర్తి చేశాడు. దీంతో అతడి సెంచరీ పూర్తయింది. ఈ తీరుపై కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ, "చివరి ఓవర్‌లో డిఫెన్సివ్ షాట్ ఆడి సింగిల్ తీయడం నమ్మలేకపోతున్నాను. సెంచరీ చేశాడు కానీ, ఇలా ఆడటమేంటి?" అంటూ తన అసహనాన్ని బహిరంగంగా వెళ్లగక్కాడు.

ఫర్హాన్ తన సెంచరీ కోసం నెమ్మదించడంతో, మరో ఎండ్‌లో ఉన్న షాదాబ్ ఖాన్ చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదడంతో పాక్ స్కోరు 199 పరుగులకు చేరింది. లేదంటే స్కోరు మరింత తక్కువగా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత రికార్డు కోసం ఫర్హాన్ విలువైన బంతులను వృథా చేశాడని అభిమానులు సైతం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

ఏదేమైనా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 102 పరుగుల భారీ తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించింది. మొదట పాక్ 199 పరుగులు చేయగా, అనంతరం నమీబియా 97 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో పాక్ సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఫర్హాన్ ఆటతీరుపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పందిస్తూ, గెలుపు ముఖ్యమని, ఆటగాడి ఫామ్ జట్టుకు మేలు చేస్తుందని సమర్థించుకున్నారు.
Go Back to Shorts
Sahibzada Farhan
Irfan Pathan
Pakistan cricket
T20 World Cup
Namibia
Shadab Khan
Salman Ali Agha
century criticism
Pakistan Super 8
cricket news

More Telugu News