Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్

Nara Lokesh Focuses on Improving Infrastructure in Government Schools
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పాఠశాలలకు సంబంధించి శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. 2020 నుంచి 2026 వరకు ఆర్థిక సంవత్సరాల వారీగా మనబడి నాడు-నేడు, మనబడి-మన భవిష్యత్ పథకాల కింద ఖర్చు చేసిన నిధుల వివరాలు, ఆయా పథకాల కింద పూర్తిగా అభివృద్ధి చేసిన, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పాఠశాలల వివరాలపై సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.

మంత్రి లోకేశ్ స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.7,500 కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందని అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. అయితే ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని తాను సూచించానని అన్నారు. 18 అంశాలపై ఈ రేటింగ్ ఇచ్చి పలు అంశాలను గమనించామని అన్నారు. సుమారు 40 శాతం పాఠశాలలు 2 స్టార్ కంటే తక్కువగా ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమని అన్నారు. 

"నేను చిత్తూరు పర్యటకు వెళ్లినప్పుడు కొన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ భవనాలు లేవు. పేయింటింగ్, కూర్చోవడానికి బెంచీలు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. ముందు లీక్ ప్రూవ్ బిల్డింగ్స్, బెంచీలు, పెయింటింగ్, ఫర్నిచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాలల్లో పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయో మొత్తం సమీక్ష చేస్తున్నాం. జీవో 117కు ప్రత్యామ్నాయంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తరగతికో ఉపాధ్యాయుడు విధానాన్ని తీసుకువచ్చాం. గతంలో కేవలం 3 శాతం పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడు ఉంటే ఇప్పుడు 33 శాతానికి తీసుకువచ్చాం. దీనివల్ల కొన్ని పాఠశాలల్లో ఎక్కువ తరగతి గదుల అవసరం ఉంది. వీటన్నింటిని పరిశీలించి మేం ముందుకు వెళ్తాం. గతంలో నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన 233 పాఠశాలలు మూసివేయడం జరిగింది. నిధులు అనవసరంగా వృధా చేయకూడదు. ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ పైనా దృష్టి సారించాం. 2019 నంచి 2024 వరకు లెర్నింగ్ అవుట్ కమ్స్‌లో వెనుకబడ్డాం" అని లోకేశ్ అన్నారు.

కూటమి ప్రభుత్వంలో నాడు-నేడు కింద రూ.500 కోట్లు బకాయిలు చెల్లించాం

వైసీపీ హయాంలో నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదని లోకేశ్ ప్రశ్నించారు. బిల్లులు చెల్లించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రూ.500 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించడం జరిగిందని అన్నారు. ఈ వివరాలన్నీ గత అసెంబ్లీ సెషన్స్‌లో విద్యారంగంపై లఘు చర్చలో వెల్లడించామని అన్నారు. వైసీపీ వాకౌట్ చేయకుండా హౌస్‌లో ఉంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాడినని అన్నారు. వారు వాకౌట్ చేసినందువల్ల విషయాలు తెలియడం లేదని అన్నారు.

వైసీపీ హయాంలో అద్భుతంగా పనిచేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఎందుకు పడిపోయాయని నిలదీశారు. ఎఫ్ఎల్ఎన్ చూస్తే 84.3 శాతం మూడో తరగతి, 62.5 శాతం ఐదో తరగతి, 47 శాతం 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. అందుకే ఏఐ టూల్ ద్వారా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ చేపట్టామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh schools
government schools
infrastructure development
education system

More Telugu News