Bharat Bandh: నేడు భారత్ బంద్.. బ్యాంకింగ్, రవాణా సేవలకు అంతరాయం!

Bharat Bandh Impact on Banking Transportation Sectors
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పదికి పైగా కార్మిక, రైతు సంఘాలు గురువారం (ఫిబ్రవరి 12) 'భారత్ బంద్'కు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

ఈ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో దీని ప్రభావం దేశవ్యాప్తంగా పలు రంగాలపై పడనుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా, రవాణా, విద్యుత్, బొగ్గు, గ్యాస్ వంటి కీలక రంగాల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఏఐబీఈఏ, ఏఐబీవోఏ వంటి కొన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నందున బ్యాంకింగ్ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించవచ్చు.

కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసేందుకే ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు.

అయితే, ఆసుపత్రులు, అంబులెన్సులు, ఫార్మసీలు, పాలు వంటి అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ, స్థానిక పరిస్థితులను బట్టి వాటి  మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.
Go Back to Shorts
Bharat Bandh
Farmers Protest
Trade Unions
Bank Strike
Narendra Modi Government
Labour Reforms India
SKM
Privatization India
AIBEA
Amarjeet Kaur

More Telugu News