Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్

Kalva Srinivasulu Fires at YSRCP for Assembly Absence
  • వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తీవ్ర విమర్శలు
  • చర్చలకు బదులు అరాచకానికే వైసీపీ అలవాటుపడిందని వ్యాఖ్య‌
  • 151 నుంచి 11 సీట్లకు పడిపోవడమే వైసీపీ పాలనకు నిదర్శనం
  • 22-ఏను అడ్డుపెట్టుకుని రైతులను వైసీపీ ప్రభుత్వం వేధించిందన్న కాల్వ‌
శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.

గత నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ, చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకే అలవాటు పడిందని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి, కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు, కూటమికి 164 స్థానాలిచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో 22-ఏ నిబంధనను ఒక ఆయుధంగా మార్చి రైతులను, సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తమ అవినీతి, భూకబ్జాలపై సభలో సమాధానం చెప్పలేకనే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉందని, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు తమ బాధ్యతను గుర్తించి, బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై గళం విప్పాలని కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
Kalva Srinivasulu
YSRCP
Andhra Pradesh Assembly
Assembly Sessions
Political Criticism
Government Whip
Budget Session
Telugu News
AP Politics
Legislative Assembly

More Telugu News