Advertisement

మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు... ఆ మున్సిపాలిటీలో బీజేపీకి చేదు అనుభవం

Vilasrao Deshmukh BJP faces setback in Maharashtra local elections
  • లాతూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం
  • 70 స్థానాలకు గాను 43 చోట్ల కాంగ్రెస్ గెలుపు
  • విలాస్‌రావు దేశ్‌ముఖ్‌పై అధ్యక్షుడి వ్యాఖ్యలతో దెబ్బతిన్న బీజేపీ
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ప్రాంతాల్లో ఆధిక్యం కనబరిచినప్పటికీ, లాతూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. మొత్తం 70 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 43 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో బీజేపీ సత్తా చాటుతున్నప్పటికీ, లాతూర్‌లో ఆ పార్టీ పరాభవానికి ఒక ప్రత్యేక కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌పై ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన విమర్శలు ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికలకు ముందు లాతూర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చవాన్, విలాస్‌రావు స్వస్థలమైన ఈ ప్రాంతంలో ఆయన జ్ఞాపకాలను తుడిచివేయాలని పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నాయకుడిని బీజేపీ కించపరిచే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

విలాస్‌రావు తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, సామాన్యుల హృదయాల నుంచి తన తండ్రి జ్ఞాపకాలను ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రవీంద్ర చవాన్ వెనక్కి తగ్గి రితేశ్ దేశ్‌ముఖ్‌కు క్షమాపణలు చెప్పారు. తాను విలాస్‌రావును విమర్శించలేదని వివరణ ఇచ్చారు.
Advertisement
Vilasrao Deshmukh
Maharashtra local elections
Latur Municipal Corporation
BJP loss
Congress victory

More Telugu News