Indonesia bus accident: ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

Indonesia Bus Accident Kills 15 in Central Java
  • సెంట్రల్ జావా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఘటన
  • మరో 19 మందికి తీవ్ర గాయాలు
  • నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బస్సు బోల్తా
ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సు అత్యంత వేగంగా వెళ్తోంది. క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే 'సెమరాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ' బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, బస్సు బోల్తా పడటం, కిటికీ అద్దాలు పగిలి లోపల అడ్డుగా ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయని అధికారులు తెలిపారు.

"చాలామంది బాధితులు బస్సు లోపలే ఇరుక్కుపోయారు. లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో గ్లాసులను తొలగించి, అతి జాగ్రత్తగా బాధితులను బయటకు తీయాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తయ్యాయని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News

Indonesia bus accident
Central Java
Semarang
Krapyak toll gate
bus crash
road accident
Indonesia road safety
rescue operation