ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఏపీ ఆల్ టైమ్ రికార్డు... ఇది చారిత్రాత్మకం: మంత్రి నాదెండ్ల
- ఖరిఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
- రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా అభివర్ణించిన మంత్రి నాదెండ్ల మనోహర్
- ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రూ. 5,682 కోట్లు జమ చేసినట్టు వెల్లడి
- రాష్ట్రవ్యాప్తంగా 3,500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు ప్రభుత్వ విజ్ఞప్తి
రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటికే అత్యధిక భాగం చెల్లింపులు పూర్తి చేశామన్నారు. ఇప్పటివరకు 3,79,538 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.5,682.77 కోట్లు జమ చేసినట్టు వివరించారు. మిగిలి ఉన్న రూ.255.43 కోట్ల బకాయిలను కూడా తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెసింగ్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తోందని తెలిపారు.
ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. సేకరణ కేంద్రాల్లో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లను సమృద్ధిగా అందుబాటులో ఉంచామన్నారు. రైతులు తమ ధాన్యం విక్రయించే క్రమంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే తక్షణమే స్పందించేందుకు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. 1967 నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని, ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం ఉన్నట్లయితే, 24 గంటల్లోనే మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతుల సౌకర్యార్థం 3,500 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులను ఆశ్రయించి, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుని నష్టపోవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి, సరైన ప్రతిఫలం పొందాలని సూచించారు.