పైలట్ల భద్రతలో కీలక ముందడుగు.. డీఆర్డీఓ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్
- యుద్ధ విమానాల ఎస్కేప్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
- చండీగఢ్లోని రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ ఫెసిలిటీలో ఈ ప్రయోగం
- భారత వైమానిక దళ పైలట్ల భద్రతకు అత్యంత కీలకమైన వ్యవస్థ ఇది
- ఈ టెక్నాలజీతో అగ్రదేశాల సరసన చేరిన భారత్
చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబ్ (TBRL) ఆధ్వర్యంలోని రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ (RTRS) కేంద్రంలో ఈ డైనమిక్ పరీక్షను నిర్వహించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సహకారంతో ఈ ప్రయోగం జరిగింది. ఇందులో భాగంగా, విమానం పైకప్పు (కానోపీ) వేరుపడటం, పైలట్ను బయటకు పంపే క్రమం, అతను సురక్షితంగా కిందకు చేరే విధానం వంటి కీలక అంశాలను ధ్రువీకరించారు.
ఈ పరీక్ష కోసం తేజస్ (LCA) యుద్ధ విమానం ముందు భాగాన్ని పోలిన ఒక డ్యుయల్ స్లైడ్ వ్యవస్థను ఉపయోగించారు. రాకెట్ మోటార్ల సహాయంతో దీనికి నియంత్రిత వేగాన్ని అందించి, వాస్తవ పరిస్థితులను సృష్టించారు. పైలట్ స్థానంలో ప్రత్యేక సెన్సార్లు అమర్చిన 'ఆంత్రోపోమార్ఫిక్ టెస్ట్ డమ్మీ'ని ఉంచి, ప్రమాద సమయంలో పైలట్పై పడే ఒత్తిడి, వేగాన్ని నమోదు చేశారు. ఈ మొత్తం ప్రక్రియను హై-స్పీడ్ కెమెరాలు చిత్రీకరించాయి. స్టాటిక్ టెస్టులతో పోలిస్తే ఇలాంటి డైనమిక్ పరీక్షలు చాలా క్లిష్టమైనవి కావడం గమనార్హం.