DK Shivakumar: ఒంటరిగా కారులో వెళ్తే ట్యాక్స్?... బెంగళూరు ట్రాఫిక్‌పై సర్కార్ క్లారిటీ

DK Shivakumar clarifies on Bengaluru traffic tax proposal
షార్ట్స్‌లో చూడండి
టెక్ హబ్ బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం 'రద్దీ పన్ను' విధించనుందంటూ వచ్చిన వార్తలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టత నిచ్చారు. అలాంటి ప్రతిపాదనేదీ తమ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన తేల్చిచెప్పారు. ఒంటరిగా కార్లలో ప్రయాణించే వారిపై పన్ను విధించాలనే ఆలోచనను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.

బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా, రద్దీ సమయాల్లో ఒంటరిగా కార్లలో ప్రయాణించే వారిని నిరుత్సాహపరిచేందుకు ప్రత్యేక పన్ను విధించాలని, ప్రయోగాత్మకంగా దీనిని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై అమలు చేయాలని చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై వివరణ ఇచ్చారు.

"ఆ వార్తలన్నీ అవాస్తవాలు. ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించడం లేదు. బెంగళూరు అభివృద్ధి కోసం కొందరు పారిశ్రామికవేత్తలు, పౌరులు స్వచ్ఛందంగా కొన్ని సూచనలు ఇస్తున్నారు. అయితే ఆ ప్రతిపాదనలు ఇంకా నా స్థాయికి రాలేదు" అని శివకుమార్ తెలిపారు. పౌరులు ఇస్తున్న సలహాలను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ అంశంపై ప్రతిపక్ష బీజేపీ చేసిన విమర్శలను కూడా శివకుమార్ తిప్పికొట్టారు. "అలాంటి పన్నుల ప్రణాళికలు బీజేపీవే అయి ఉంటాయి. అది కేంద్ర ప్రభుత్వ ఆలోచన కావచ్చు. మా ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు, ఈ పన్ను ప్రతిపాదనపై ప్రతిపక్ష నేత ఆర్. అశోక తీవ్రంగా స్పందించారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని 'తుగ్లక్ ప్రభుత్వం'గా అభివర్ణించారు. "ముందు రోడ్లు బాగుచేస్తే అంతా సర్దుకుంటుంది. అది చేయకుండా ప్రజలపై పన్నులు వేయాలని చూస్తున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఒంటరిగానే కార్లలో తిరుగుతారు, వారిపై ఎంత పన్ను వేస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశం కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి చివాట్లు తప్పవని ఆయన హెచ్చరించారు.
Go Back to Shorts
DK Shivakumar
Bengaluru traffic
Karnataka government
traffic congestion tax
outer ring road
ORR
R Ashok
Siddaramaiah government
Bengaluru development

More Telugu News