Anil Chauhan: సముద్ర జలాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది: జనరల్ అనిల్ చౌహాన్

Anil Chauhan India Emerging as Unstoppable Force in Sea Waters
షార్ట్స్‌లో చూడండి
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ తయారుచేసిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్-షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ‘అర్నాల’ను విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో ఘనంగా ప్రారంభించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఈ నౌకను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు వాటిని స్వయంగా తయారుచేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. సముద్ర జలాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఇప్పటివరకు 98 యుద్ధ నౌకలను నిర్మించామని, ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, కార్వెట్లు ఉన్నాయని వివరించారు. మరో 60 నౌకలు నిర్మాణ దశలో ఉండగా, 180 నౌకల నిర్మాణానికి ఒప్పందాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. కొత్తగా నౌకాదళంలో చేరిన ‘అర్నాల’ సవాళ్లను స్వీకరించగలదని, భారత తీర ప్రాంత రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్, వార్‌షిప్ ప్రొడక్షన్ అండ్ అక్విజిషన్ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ రాజారామ్ స్వామినాథన్, జీఆర్ఎస్‌ఈ సీఎండీ కమొడోర్ పి. హరి తదితరులు పాల్గొన్నారు. 
Go Back to Shorts
Anil Chauhan
Indian Navy
INS Arnala
Anti Submarine Warfare
Naval Dockyard Visakhapatnam
Garden Reach Shipbuilders
Indian Defence
Make in India
Rajesh Pendharkar
Naval Ships

More Telugu News