Air India Flight Accident: లైక్స్ కోసం మా బాధను వాడుకోవద్దు.. విమాన ప్రమాద బాధితుడి ఆవేదన

Plane Crash Victims Cousin Kuldeep Bhat Plea Against Social Media Exploitation
షార్ట్స్‌లో చూడండి
విమాన ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి దు:ఖంలో ఉన్న తమను మరింత క్షోభకు గురిచేయవద్దని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసత్య ప్రచారాలు, ఏఐ వీడియోలతో తమను కుంగిపోయేలా చేయవద్దని వేడుకుంటున్నారు. అహ్మదాబాద్‌ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన కోమి వ్యాస్ అనే ప్రయాణికురాలి కజిన్ కులదీప్ భట్, తమ కుటుంబంతో పాటు ఇతర బాధితుల కుటుంబాలు పడుతున్న వేదనను వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది.

విమాన ప్రమాదంలో కోమి వ్యాస్‌తో పాటు ఆమె భర్త ప్రతీక్ జోషి, వారి ముగ్గురు పిల్లలు ప్రద్యుత్, నకుల్, మిరాయా మరణించారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే, సోషల్ మీడియాలో కొందరు ఇన్ ఫ్లూయెన్సర్లు లైకులు, వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడానికి దారుణంగా వ్యవహరిస్తున్నారని కులదీప్ భట్ ఆరోపించారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, నకిలీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. "ఇలాంటి చర్యల వల్ల మా కుటుంబంతో పాటు ప్రమాదంలో మరణించిన ఇతరుల కుటుంబాలు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నాయి" అని ఆయన తెలిపారు.

కోమి విమానం ఎక్కే ముందు కుటుంబ సభ్యులతో తీసుకున్న సెల్ఫీ ఒకటి తమ ఫ్యామిలీ గ్రూపులో పోస్ట్ చేశారని, అది ఇప్పుడు వైరల్ అయిందని భట్ చెప్పారు. "ఆ ఫోటోను ఉపయోగించి కొందరు ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు" అని ఆయన వివరించారు. కోమి కుమార్తె మిరాయా గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, "ఆ పాప మృతదేహం కాలిపోయిందని, ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయంటూ వీడియోలు పెడుతున్నారు. డీఎన్ఏ నమూనా ఇంకా సరిపోలలేదు. ఇది మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది" అని ఆయన వాపోయారు.

కోమి పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు కూడా సృష్టించారని, ఆమె ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల మృతదేహాలు చూపుతున్నామంటూ ప్రచారంలో ఉన్న మరో వీడియో నిజానికి వేరే పాత ఘటనకు సంబంధించినదని, అందులోని శవపేటికలపై వేరేవారి పేర్లు చిత్ర అక్షరాల్లో ఉన్నాయని భట్ స్పష్టం చేశారు.

"దయచేసి ఇలాంటివి ఆపండి. మీ పాపులారిటీ కోసం, లైక్స్ కోసం మాకు ఇంత మానసిక క్షోభ కలిగిస్తారా?" అని కులదీప్ భట్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లను అభ్యర్థించారు. ఏదైనా సమాచారం కావాలంటే అధికారులను సంప్రదించాలని, అధికారిక సమాచారం అక్కడి నుంచి వస్తుందని, అవసరమైతే తామే ఫోటోలు, వీడియోలు అందిస్తామని, కానీ వినోదం కోసం ఇలాంటి బాధ్యతారహిత పనులు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. "ఇలాంటి సమయంలో మీరేం చేస్తున్నారు? దయచేసి ఇవన్నీ ఆపండి" అని ఆయన కోరారు.
Go Back to Shorts
Air India Flight Accident
Fake News
Komi Vyas
Ahmedabad Plane Crash
Social Media Influencers
AI Videos
Kuldeep Bhat
Victim Family
Social Media Ethics
Plane Crash Victims

More Telugu News