ఆర్సీబీ విజయోత్సవ పరేడ్కు బెంగళూరు పోలీసుల అనుమతి నిరాకరణ
- జట్టు భారీ ఊరేగింపు ప్రణాళికకు నో చెప్పిన పోలీసులు
- సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో సత్కార కార్యక్రమానికి మాత్రమే అనుమతి
- స్టేడియంలోకి టికెట్, పాస్ ఉన్నవారికే ప్రవేశం
- బెంగళూరు సీబీడీ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
- పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానుల్లో తీవ్ర నిరాశ
ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం, ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకున్న తరువాత, ఓపెన్ టాప్ బస్సులో మధ్యాహ్నం 3:30 గంటలకు విధానసౌధ నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభించి, సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంకు చేరాలని భావించారు. అక్కడ సుమారు 50 వేల మంది అభిమానుల సమక్షంలో సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేయాలని ఆర్సీబీ యాజమాన్యం యోచించింది.
అయితే, ఈ భారీ విక్టరీ పరేడ్కు అనుమతి ఇవ్వలేమని బెంగళూరు పోలీసులు ఆర్సీబీ యాజమాన్యానికి స్పష్టం చేశారు. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రత్యామ్నాయంగా, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు చిన్నస్వామి స్టేడియంలో జట్టుకు సత్కార కార్యక్రమం నిర్వహించుకోవడానికి పోలీసులు అంగీకరించారు.
ఈ సత్కార కార్యక్రమానికి కూడా పలు ఆంక్షలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. స్టేడియంలోకి ప్రవేశం పరిమితం చేస్తున్నామని, టికెట్ లేదా పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని వెల్లడించారు. స్టేడియం వద్ద పార్కింగ్ స్థలం కూడా తక్కువగా ఉన్నందున, అభిమానులు మెట్రో రైలు లేదా ఇతర ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాల నేపథ్యంలో, నగరవాసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సీబీడీ (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్) ప్రాంతానికి రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆ మార్గంలో అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచనలు జారీ చేశారు.