రేపే అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం... జగన్ ఇంటికి వెళ్లి ఆహ్వానించిన కూటమి ప్రభుత్వం
- ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం
- ప్రొటోకాల్ ప్రకారం జగన్ కు ఆహ్వానం
- గతంలో అమరావతి శంకుస్థాపనకు హాజరుకాని జగన్
గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ జగన్ హాజరు కాలేదు. అంతేకాకుండా, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో, తాజా ఆహ్వానంపై జగన్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాగా, ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నారాయణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పాల్గొనే సభ, ఇతర కార్యక్రమాల కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.