Mohan Bhagwat: మనం ఒకరికి హాని తలపెట్టం... కానీ!: ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్

Mohan Bhagwat on Non Violence and Self Defense
షార్ట్స్‌లో చూడండి
అహింస భారతదేశపు సహజ సిద్ధమైన గుణమని, దేశపు విలువల్లో కీలకమైన భాగమని ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, అదే సమయంలో హింసకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పడం కూడా అంతే అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇవాళ ఢిల్లీలో 'ది హిందూ మేనిఫెస్టో' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇతరులకు హాని తలపెట్టడం లేదా ఇబ్బంది పెట్టడం లేదా అగౌరవపరచడం మన సంస్కృతి కాదన్నారు. ప్రజలను రక్షించడం పాలకుడి విధి అని, ఆ కర్తవ్యాన్ని వారు నెరవేరుస్తారని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా భగవత్ పౌరాణిక ఉదాహరణలను ఉటంకించారు. భగవద్గీత అహింసను బోధిస్తుందని, కానీ అదే గీత అర్జునుడు యుద్ధం చేసి శత్రువులను సంహరించేలా చేసిందని గుర్తుచేశారు. "ఎదుటివారి అభివృద్ధి లేదా మార్పు కేవలం ఆ మార్గం ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కొన్ని అంశాల్లో లేదా కొందరిలో ఉంటాయి" అని భగవత్ వివరించారు. రావణుడిని ఉదాహరణగా చూపుతూ, రాముడు అతడిని చంపింది కక్షతో కాదని, రావణుడి మేలు కోసమేనని వ్యాఖ్యానించారు.

"అహింస మన స్వభావం, మన విలువ. మన అహింస ఇతరులను మార్చి, వారిని కూడా అహింసావాదులుగా తీర్చిదిద్దడానికే" అని భగవత్ నొక్కి చెప్పారు. మనల్ని చూసి కొందరు మారతారని, కానీ మరికొందరు ఎంత చెప్పినా మారరని, ప్రపంచంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తారని అన్నారు. "అలాంటి వారి విషయంలో ఏం చేయాలి?" అని ఆయన ప్రశ్నించారు. దుర్మార్గులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందని అన్నారు.
Go Back to Shorts
Mohan Bhagwat
RSS Sarsanghachalak
Non-violence
Ahimsa
India
Hindu Manifesto
Book Launch
Terrorism
Pulwama Attack
Self-defense

More Telugu News