USA: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ, కాన్సులేట్ ఎదుట నిరసన

Indian Consulate Denies Visa To US Politician Kshama Sawant
షార్ట్స్‌లో చూడండి
ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ అత్యవసర వీసాను నిరాకరించింది. ఈ నేపథ్యంలో క్షమా సావంత్ మద్దతుదారులు అమెరికాలోని సియాటెల్ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదుట నిరసన చేపట్టారు. పలువురు ఆందోళనకారులు గుమికూడటంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని, స్థానిక అధికారులను పిలవాల్సి వచ్చిందని భారత కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి.

ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత కొంతమంది వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణంలోకి వచ్చే ప్రయత్నం చేశారని, వారిని ఎందుకు వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే, వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించామని భారత కాన్సులేట్ తెలిపింది. అయితే వారు వెళ్లడానికి నిరాకరించారని తెలిపింది. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, బెదిరింపులకు దిగారని పేర్కొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో పోలీసులను పిలిపించినట్లు వెల్లడించింది.

ఈ ఆందోళనకు ఎవరు దిగారు, ఎందుకు దిగారనే విషయమై మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

అదే సమయంలో, సియాటెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్ సామాజిక మాధ్యమంలో స్పందించారు. భారత్ వీసా తిరస్కరణకు గురైన వారిలో తన పేరు కూడా ఉందని, అందుకే తన మద్దతుదారులతో కలిసి కాన్సులేట్ ఎదుట నిరసన చేపట్టామని పేర్కొన్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపామని ఆమె పేర్కొన్నారు.
Go Back to Shorts
USA
India
NRI

More Telugu News