కాంగ్రెస్ పార్టీది బురద రాజకీయం: 'నీళ్లు-నిజాలు' రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత

Kavitha fires at Congress politics over water issue
  • మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా గోదావరి వరదను తట్టుకుందన్న కవిత
  • కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టుల్లోని మిగిలిన పనులను పూర్తి చేయాలని హితవు
  • కేసీఆర్‌ను శత్రువులా భావించవద్దని రేవంత్ రెడ్డికి హితవు
కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా గోదావరి వరదను తట్టుకొని నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సాగునీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు మాని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 'నీళ్లు-నిజాలు' పేరుతో హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కేసీఆర్ పూర్తి చేసిన పెద్ద ప్రాజెక్టుల్లో కొన్ని చిన్నచిన్న పనులు మిగిలిపోయాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారని, జాతీయస్థాయిలో కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీని బీజేపీ కొనసాగిస్తోందని గుర్తు చేశారు. అలాగే కేసీఆర్ ప్రారంభించిన పనులను రేవంత్ రెడ్డి కొనసాగించాలని సూచించారు.

రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను శత్రువుగా భావిస్తున్నారని, కానీ తెలంగాణ జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులే శత్రువులని గుర్తించాలన్నారు. ఆంధ్రా కేడర్‌లో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించి, కృష్ణా ట్రైబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని కవిత కోరారు. కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తేనే తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారిందన్నారు.
Go Back to Shorts
K Kavitha
BRS
Congress

More Telugu News