Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మరో రెండు కీలక ఒప్పందాలు... డీటెయిల్స్ ఇవిగో!

AP Govt inked two more key MoUs
షార్ట్స్‌లో చూడండి
అధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో డీప్-టెక్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ రెండు ఒప్పందాలు జరిగాయి.

ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో AI-ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE)... యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ (UoI)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. మరోవైపు, రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (TBI)తో ఏపీ ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. 

ఉండవల్లి నివాసంలో నారా లోకేశ్ సమక్షంలో ఫిజిక్స్ వాలా, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వేర్వేరుగా ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారిస్తుంది. 

హబ్-అండ్-స్పోక్ మోడల్‌ను అనుసరించి ఇన్నోవేషన్ యూనివర్సిటీ సెంట్రల్ హబ్‌గా పనిచేస్తుంది. దీని ద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన, హైబ్రిడ్ విద్య అందుబాటులోకి వస్తుంది. ఆన్‌లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను ఇంటిగ్రేట్ చేస్తారు. 

ప్రపంచస్థాయి ప్రమాణాలతో యువతకు శిక్షణే లక్ష్యం: నారా లోకేశ్

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... కృత్రిమ మేధ (ఏఐ)లో ఏపీ యువతను నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని అన్నారు. అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, అందుకు ఏపీ యువతను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమన్నారు. 

పరిశ్రమల డిమాండ్, ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ పై యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ దృష్టిసారిస్తుందని చెప్పారు. అధునాతన సాంకేతికత, విద్యను ఏకీకృతం చేయడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కృషి చేస్తుందని చెప్పారు. ఏఐలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక, నెక్స్ట్ జనరేషన్ నైపుణ్యాలకు మార్గం సుగమం చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. 

ఉన్నత విద్య ఆధునీకరణకు టీబీఐతో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయంగా విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై TBI ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. 

ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే విద్యా విధానాలను గుర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో తృతీయ విద్య ల్యాండ్ స్కేప్ ను మెరుగుపర్చడానికి కృషిచేస్తుంది. ఏపీలో సమగ్ర, స్థిరమైన ఆర్థికవృద్ధి వేదిక ఏర్పాటుకు అవసరమైన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో నైపుణ్య అంతరాలను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వంతో టీబీఐ కలసి పనిచేస్తుంది. ఇందుకు అవసరమైన సమగ్ర రోడ్ మ్యాప్ ను అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది.
Go Back to Shorts
Nara Lokesh
Physics Wallah
TBI
AP Govt
MoU
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News