Chandrababu: సిగ్గులేకుండా ప్యాలెస్ కట్టుకున్నారు... కానీ దాంట్లోకి వెళ్లగలిగారా?: సీఎం చంద్రబాబు

CM Chandrababu speech in AP Assembly
షార్ట్స్‌లో చూడండి
గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని,  అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాదుడు, స్కాముల కోసమే స్కీములు పెట్టి చరిత్రలో లేని విధంగా రాష్ట్రాన్ని దోచేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బడ్జెట్ పై ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజల ఆశలు నెరవేర్చాలంటే మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉందని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ ముందుకెళుతున్నామని, వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో వెలికితీశామని చెప్పారు.

కోట్లు కుమ్మరించి ప్యాలెస్ కట్టుకున్నా దాంట్లోకి వెళ్లలేకపోయారు!

రూ.430 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆ బిల్డింగులు చూసి నాకే కళ్లు తిరిగాయి. ప్రభుత్వ ధనంతో ప్యాలెస్ లు కడతారా? సిగ్గూ ఎగ్గూ లేకుండా కుటుంబ సభ్యులకు కూడా ప్యాలెస్ లు కట్టుకున్నారు. రుషికొండపై 7 బ్లాకులు కట్టారు. 

పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులను మభ్యపెట్టారు. కోట్లు కుమ్మరించి ప్యాలెస్ కట్టుకున్నారు కానీ దానిలోకి వెళ్లలేకపోయారు. 

రూ.400 కోట్లు సొంత పత్రిక సాక్షికి ప్రకటనల రూపంలో ఇచ్చుకున్నారు. ప్రజాధనంతో వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చుకున్నారు.

కన్నతల్లిపై అసభ్యకర పోస్టింగులు పెట్టించే వాళ్లు మనుషులా... పశువులా..? 

సోషల్ మీడియాలో సైకోలను తయారు చేశారు. కన్నతల్లిపైనా అసభ్యకర పోస్టింగులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? కన్నతల్లి శీలాన్ని శంకించే పరిస్థితి ఉందంటే వాళ్లు మనుషులా... పశువులా...? తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్కా? 

ఎన్డీయే కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరు... ఒకవేళ పెడితే కఠినంగా శిక్షిస్తాం. ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తాం. రాబోయే రోజల్లో ఏ ఆడబిడ్డా అవమాన పడటానికి వీళ్లేదు. చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. 

ఆస్తుల సృష్టి జరగలేదు... బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు

అమరావతి, పోలవరం, విద్యుత్ రంగం విధ్వంసం చేశారు. ఐదేళ్లు పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఏమీ కల్పించలేదు. ఐదేళ్ల పాటు ఆస్తుల సృష్టి లేదు... ఆదాయం పెరగలేదు. ఆదాయం తగ్గింపుతో పాటు పన్నులు పెంచారు. బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు... ఆస్తులు తాకట్టు పెట్టారు.

మేము అధికారంలోకి రాగానే  7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశాం. ప్రజలు 21 మంది ఎంపీలను గెలిపించడంతో ఢిల్లీలో పలుకుబడి పెరిగింది. కేంద్ర సహకారం లేకుంటే రాష్ట్రం ఏమయ్యేదో తెలిసేది కాదు. 

నేరస్తుల రాజకీయ ముసుగు తొలగిస్తాం

జీరో టాలరెన్స్ విధానంతో వెళతాం. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకునే వారికి ముసుగు తొలగిస్తాం. సభకు వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవచ్చు... కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. త్వరలో టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. అమరావతి, పోలవరాన్ని పట్టాలెక్కించాం. గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు. 

సూపర్-6 లో ఇచ్చిన దీపం-2 పథకం అమలు చేశాం. 48 గంటల్లోనే సిలిండర్ కు డబ్బులు అందిస్తున్నాం. లబ్ధిదారులకు నేరుగా అందించే విధానాన్ని త్వరలో తీసుకొస్తాం. డిసెంబరులో లక్ష ఇళ్లు గృహ ప్రవేశాలు నిర్వహిస్తాం. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి జాగా ఇస్తాం. 

ప్రజల నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెడదాం

ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు పెను విప్లవంలా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందు నుండీ చెప్పారు. బీజేపీ కూడా వచ్చి కలవడంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల 93 శాతం స్ట్రైక్ రేట్ తో సీట్లు సాధించాం. ఇది ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి తార్కాణం. నూటికి నూరు శాతం ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం. 


Go Back to Shorts
Chandrababu
Budget
Speech
AP Assembly Session
TDP-JanaSena-BJP Alliance
Jagan
YSRCP

More Telugu News