పెళ్లికి ముందురోజు కట్నం డబ్బుతో వరుడు జంప్... హైదరాబాద్ లో ఘటన
- వధూవరులిద్దరూ లవర్స్
- పెద్దలను ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధం
- చివరిక్షణంలో షాకిచ్చిన ప్రియుడు
మారేడ్ పల్లికి చెందిన సందీప్ రమేశ్ ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి ప్రేమ కథకు తల్లిద్రండులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరూ మేజర్లే.. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయినా తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టంలేక అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని లవర్స్ నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కష్టపడి పెద్దవాళ్లను ఒప్పించారు. ఈ నెల 8న (శుక్రవారం) వారిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు.
ప్రేమ వివాహమే అయినా కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.10 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లలో ఇరుకుటుంబాలు తలమునకలుగా ఉండగా... గురువారం నాడు సందీప్ రమేశ్ అందరికీ షాకిచ్చాడు. డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయాడు. విషయం తెలిసిన పెళ్లికూతురు నివ్వెరపోయింది. ఈ ఘటనకు సంబంధించి పెళ్లికూతురు కుటుంబం పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.