రేపు ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

AP Cabinet will meet tomorrow
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
  • ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రిపీల్ బిల్లుపై చర్చ
  • స్పోర్ట్స్ కోటా పెంపు, ఒలింపిక్స్ స్వర్ణం నజరానా పెంపుపై చర్చ 
రేపు (నవంబరు 6) ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు క్యాబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం-1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ చట్టంలోని కొన్ని నిబంధనల వల్ల కేసుల నమోదుకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టు గుర్తించారు. 

వైసీపీ పాలనలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణలపైనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలకు ఇబ్బందులు వస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

మొదట ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు తీసుకురానున్నారు. ఈ బిల్లుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

అంతేకాకుండా, రేపటి క్యాబినెట్ సమావేశంలో, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పై చర్చించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం రద్దు చేయాలని కూటమి సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానికి అనుబంధంగా ఇచ్చిన జీవో నెం.77ని కూడా రద్దు చేయాలన్న నిర్ణయానికి క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. 

ఇక, 2017 నాటి స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను ప్రాతిపదికగా తీసుకోవడం... డ్రోన్, సెమీకండక్టర్లు, డేటా  సెంటర్ పాలసీలకు క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలపనున్నారు. 

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపు, ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన వారికి నజరానా రూ.7 కోట్లకు పెంపు వంటి సీఎం చంద్రబాబు ప్రతిపాదనలపై కూడా రేపటి క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూకేటాయింపు అంశం కూడా ఈ భేటీలో చర్చకు రానుంది.
Go Back to Shorts
AP Cabinet
Meeting
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News