జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నీచర్పై జీఏడీకి వైసీపీ లేఖ
- జగన్ క్యాంప్ ఆఫీస్లోని ప్రభుత్వ ఫర్నీచర్ను తీసుకువెళ్లండని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వినతి
- జీఏడీకి మరో సారి లేఖ రాసిన లేళ్ల అప్పిరెడ్డి
- ఫర్నీచర్ను వెనక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే, వాటి ఖరీదు చెబితే చెల్లిస్తామని లేఖలో వెల్లడి
ఈ విషయమై ఇప్పటికే నాలుగు పర్యాయాలు లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు. తొలుత జూన్ 15, ఆ తర్వాత జూన్ 19, మళ్లీ జులై 1, తిరిగి జులై 29న లేఖలు రాసినట్లుగా ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా పార్టీ కార్యాలయ ఇంఛార్జ్ గణేశ్ రెడ్డి అనేక పర్యాయాలు ఈ విషయంపై జీఏడీని సంప్రదించిన విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. అసలు ఆ ఫర్నీచర్ను వెనక్కు తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని లేళ్ల అప్పిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేవలం నిందలు మోపడానికే, దీనిపై స్పందించడం లేదా? అని ఆయన నిలదీశారు.
ఫర్నీచర్ను తీసుకుపోవడం వీలు కాకపోతే, ఎక్కడికి పంపాలో జీఏడీ చెప్పాలని అప్పిరెడ్డి కోరారు. ఒకవేళ ఆ ఫర్నీచర్ను వెనక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే, వాటి ఖరీదు చెబితే చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ ఫర్నీచర్ వల్ల తమ ఆఫీస్లో స్థలాభావం నెలకొందని, అందువల్ల ఏ విషయమూ వెంటనే చెప్పాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ లేఖలో కోరారు.
.