దుండిగల్ లో విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా

HYDRAA Action Starts At Dundigal And Sunnam Cheruvu
  • భారీ బందోబస్తు మధ్య ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు షురూ
  • అన్ని చెరువులకూ చెర వదిలించాలంటున్న స్థానికులు
  • సున్నం చెరువులో అక్రమ నిర్మాణాల తొలగింపు
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను, బడాబాబుల విల్లాలను సైతం కూల్చివేస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మునిసిపాలిటీలో ఆదివారం కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట కత్వ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో ఇటీవల హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ ఏరియాలో పర్యటించారు.

శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట ఎన్ఆర్ఐ విజయలక్ష్మి కత్వా చెరువు ఎఫ్టీఎల్/బఫర్ జోన్‌లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు. నిర్మాణదారులు, కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఉదయం పోలీసు బలగాల భద్రత మధ్య, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. ఈ కూల్చివేతలను స్వాగతించిన స్థానికులు.. దుండిగల్ లోని మిగతా చెరువులకు పట్టిన చెర విడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

సున్నం చెరువులో..
మరోవైపు, శేరిలింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తోంది. దాదాపు 26 ఎకరాల్లో విస్తరించిన సున్నం చెరువు ఆక్రమణల కారణంగా కుచించుకుపోయి 2013 నాటికే 15.23 ఎకరాలుగా ఉంది. చెరువు ఫుల్ టాంక్ లెవెల్ (ఎఫ్ టీఎల్) పరిధిలోనే సర్వే నెంబర్ 13, 14, 16 ఉన్నట్లుగా అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో 2014 మే 14న సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ను నిర్ధారిస్తూ అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఎఫ్ టీఎల్ పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫెన్సింగ్ ను కొందరు ముందుకు జరిపి స్థలాన్ని ఆక్రమించుకోగా, మరికొందరు ఫెన్సింగ్ పూర్తిగా తొలగించి యథేచ్చగా కబ్జా చేశారు. ఏకంగా రోడ్డు కూడా నిర్మించి భవనాలు కట్టుకున్నారు. దీనిపై గతేడాది శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ చెరువులోని ఆక్రమణలను తొలగించే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఆదివారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలుపెట్టింది.
Go Back to Shorts
HYDRA
Dundigal
Sunnam Cheruvu
Villas
Ranganath

More Telugu News