తెలంగాణలో కటకటాల పాలైన మరో అవినీతి అధికారి .. రూ.కోట్ల నగదు, నగల స్వాధీనం
- నిజామాబాద్ నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ నివాసంలో ఏసీబీ సోదాలు
- రూ.6.07 కోట్ల ఆస్తుల స్వాధీనం
- ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న పక్కా సమాచారంతో శుక్రవారం నాలుగు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్లలోని నరేందర్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు జరిపారు. నిజామాబాద్లోని నరేందర్ నివాసంలో ఆరు కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదు, నగలను అధికారులు గుర్తించారు. వాటిలో రూ. 2.93 కోట్ల నగదు, రూ. ఆరు లక్షల విలువైన 51 తులాల బంగారు అభరణాలు, రూ.1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తుల పత్రాలు, ఆయన భార్య, తల్లి పేరున బ్యాంక్ ఖాతాల్లో రూ.1.10 కోట్ల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.
నాన్ గెజిటెడ్ అధికారి హోదాలో ఉండి ఇంత పెద్ద మొత్తంలో నగదు, నగలు, స్థిరాస్తులు ఉండటంతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేసినట్టు నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. నరేందర్ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. గతంలోనూ అవినీతి ఆరోపణలతో నరేందర్ సస్పెండ్ అయ్యారు.
అసరా పింఛన్ల నగదును లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారన్న అభియోగంపై ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఆయనను బోధన్ మున్సిపాలిటీకి బదిలీ చేయగా, రాజకీయ నేతలు, అధికారులతో ఉన్న పరిచయాలతో బదిలీని రద్దు చేయించుకుని నిజామాబాద్ లోనే కొనసాగుతున్నారు.