Roja Selvamani: కేంద్రం అనుమ‌తితో చేప‌ట్టిన నిర్మాణాల్లో అవినీతి ఎక్క‌డుంది?: రోజా

YCP Former Minister Roja Selvamani Senstaional Tweet
  • రుషికొండలో నిర్మించిన‌ పర్యాటక భ‌వ‌నాలపై మాజీ మంత్రి రోజా ట్వీట్‌
  • విశాఖను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంక‌ల్పంతోనే నిర్మాణాలన్న వైసీపీ నేత‌ 
  • 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి నిర్మాణాలు చేప‌ట్టామ‌ని వెల్ల‌డి
  • హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక ఇచ్చార‌న్న రోజా
త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో రుషికొండలో నిర్మించిన‌ పర్యాటక భ‌వ‌నాల విష‌య‌మై వైసీపీ మాజీ మంత్రి రోజా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఆమె ప్ర‌శ్నించారు. 

"విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంక‌ల్పంతో మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా? వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా? 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా?

61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? ఏడు బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా?

హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా? ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా? లేదా? హైదరాబాద్‌లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెగా చెల్లించిన వాళ్లా... ఈరోజు విమర్శలు చేసేది?

లేక్ వ్యూ గెస్ట్‌ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్‌ల‌లో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది? మా జ‌గ‌న‌న్నపై, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెన్ను చూపేది లేదు. వెనకడుగు వేసేది లేదు. జై జగన్..!" అంటూ రోజా ట్వీట్ చేశారు.
Roja Selvamani
YSRCP
Andhra Pradesh
Rishikonda
Vizag

More Telugu News