యూపీలో న్యాయమూర్తి శునకం చోరీ.. 12 మందిపై కేసు నమోదు
- బరేలీలో వెలుగు చూసిన ఘటన
- జడ్జి శునకం తమను కరిచిందంటూ పొరుగింటి వ్యక్తి ఫిర్యాదు,
- రెండు కుటుంబాల మధ్య ఘర్షణ, పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయమూర్తి
- శునకం కోసం గాలిస్తున్న పోలీసులు
ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం, కొన్ని రోజుల క్రితం న్యాయమూర్తి కుటుంబానికి, పొరుగింట్లోని డంపీ అహ్మద్ అనే వ్యక్తి కుటుంబానికి మధ్య శునకం విషయంలో వివాదం తలెత్తింది. అదే కాలనీలో ఉంటున్న డంపీ కుమారుడు ఖాదిర్ ఖాన్ న్యాయమూర్తి కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించాడు. మే 16న ఇరు కుటుంబాల మధ్య మరోసారి వివాదం తలెత్తింది.
జడ్జి శునకం తనపైనా, తన కూతురిపైనా దాడి చేసిందని అహ్మద్ భార్య న్యాయమూర్తి కుటుంబసభ్యులతో గొడవకు దిగింది. ఈ ఘర్షణ గురించి కుటుంబసభ్యులు న్యాయమూర్తికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఫోన్ ద్వారా బరేలీ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. శునకం కోసం గాలిస్తున్నారు. అయితే, ఘటనపై వ్యాఖ్యానించేందుకు న్యాయమూర్తి కుటుంబం నిరాకరించింది.