భారత్ ఇచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్ ను నడపగలిగిన పైలట్లు మా వద్ద లేరు: మాల్దీవుల మంత్రి

Maldives ministers says their pilots not trained enough to fly india donated aircrafts
  • రెండు హెలికాఫ్టర్లు, ఓ డోర్నియర్ విమానం విరాళంగా ఇచ్చిన భారత్
  • మాల్దీవుల సైనికులకు శిక్షణ బాధ్యత కూడా భారత్ తీసుకున్న వైనం
  • వివిధ కారణాలతో మధ్యలో నిలిచిపోయిన శిక్షణ  
భారత్ తమ దేశానికి విరాళంగా ఇచ్చిన మూడు మిలిటరీ విహంగాలను నడిపే సామర్థ్యం తమ పైలట్లకు లేదని మాల్దీవుల రక్షణ శాఖ మంత్రి ఘాసన్ మౌమూన్ తెలిపారు. ఈ విహంగాలను నడిపేందుకు కావాల్సిన శిక్షణ వారు పూర్తి చేసుకోలేదన్నారు. వీటిని నడిపేందుకు తగిన లైసెన్సులు వారి వద్ద లేవని చెప్పారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. భారత్ మాల్దీవులకు రెండు హెలికాఫ్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని విరాళంగా ఇచ్చింది. వీటిని నడిపేందుకు అక్కడి సైనికులకు శిక్షణ కూడా ప్రారంభించింది. అయితే, వివిధ కారణాల రీత్యా ఈ శిక్షణ కార్యక్రమం అసంపూర్ణంగా మిగిలిపోవడంతో మాల్దీవుల సైన్యంలో ఈ విమానాలను నడిపే వారు లేకుండా పోయారు. 

‘‘ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడిపేందుకు శిక్షణలో భాగంగా పలు దశల్లో ఉత్తీర్ణత సాధించాలి. పలు కారణాల వల్ల దేశ సైనిక సిబ్బంది శిక్షణను పూర్తి చేయలేదు. ప్రస్తుతం మా సైన్యంలో ఈ మూడు ఎయిర్ క్రాఫ్ట్‌లను నడిపించడానికి లైసెన్స్, లేదా సామర్థ్యం ఉన్న వారు లేరు’’ అని ఆయన తెలిపారు. 

చైనా అనుకూలుడిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడయ్యాక భారత్‌తో దౌత్యసంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారత సైనిక బలగాలను మే 10 లోపు తమ దేశాన్ని విడిచివెళ్లాలని ముయిజ్జు గడువు విధించడంతో డెడ్‌లైన్‌కు ఒక రోజు ముందే భారత సైనిక బృందం మాల్దీవులను వీడింది. ఈ దౌత్య వివాదాల నేపథ్యంలో భారతీయు పర్యాటకుల రాక తగ్గిపోవడంతో మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో, భారతీయులను ప్రసన్నం చేసుకునేందుకు ఇటీవలే మాల్దీవుల మంత్రి భారత్‌లో పర్యటించారు. తమ దేశానికి రావాలంటూ ఇక్కడి వారికి విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Maldives
India
Diplomatic row

More Telugu News