మూడో దశ పోలింగ్‌తోనే కూటమి నేలకరిచింది... ఇండియా కూటమిలో విచిత్ర పరిస్థితి నెలకొంది: ప్రధాని మోదీ

PM Narendra Modi on India alliance
  • బీజేపీపై ప్రజలకు పూర్తి విశ్వాసం కనిపిస్తోందన్న మోదీ
  • కూటమిలోని కాంగ్రెస్, లెఫ్ట్ కేరళలో ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నాయన్న ప్రధాని
  • కూటమి ప్రచారం అగమ్య గోచరంగా మారిందని వ్యాఖ్య
మూడో దశ పోలింగ్‌తోనే ఇండియా కూటమి ఓటమిని అర్థం చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం నాడు ఆయన ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బీజేపీపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం కనిపిస్తోందన్నారు. తాను గత రెండు లోక్ సభ ఎన్నికలను చూశానని... చాలామంది ప్రజలు రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కాలేదన్నారు. కానీ ఇప్పుడు అందరూ ఉత్సాహంతో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కంటే ఎక్కువమందిలో దేశమంటే భక్తి, సమాజమంటే ప్రేమ కనిపిస్తోందని పేర్కొన్నారు. తమ గెలుపు ఖాయమన్నారు.

ఇండియా కూటమిలో విచిత్ర పరిస్థితి నెలకొందన్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కేరళలో ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నాయని గుర్తు చేశారు. దీంతో కూటమి ప్రచారం అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈసారి కాంగ్రెస్ పరిస్థితి గతంలో కంటే దారుణంగా ఉంటుందని జోస్యం చెప్పారు.

కూటమి నాయకులు ఓసారి ఈసీకి ఫిర్యాదు చేస్తారని... మరోసారి ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తారని ఎద్దేవా చేశారు. వారి తీరు చూస్తుంటే వారికి ప్రజల వద్దకు వెళ్లే బలమే కనిపించడం లేదన్నారు. ఓడిపోయేవారు అనేక కారణాలు వెతుకుతారని... అందుకే ఈవీఎంలు, ఈసీని తప్పుబడుతారని ఇండియా కూటమికి చురక అంటించారు. అవసరమైతే జనాన్ని కూడా వారు తప్పుపడతారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
Lok Sabha Polls

More Telugu News