కేసీఆర్, ముందు నీ భాష మార్చుకో.. ఆ సొమ్మును కక్కించి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం: భట్టివిక్రమార్క

Bhattivikramarka predicts brs will win no seats in telangana
  • దద్దమ్మలు, సన్నాసులు అంటే ఊరుకునేది లేదని హెచ్చరిక
  • తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం
  • నామా నాగేశ్వర రావును ఏ పార్టీ నుంచి కేంద్రమంత్రిని చేస్తారని ఎద్దేవా
'కేసీఆర్ ముందు నీ భాష మార్చుకో... సిగ్గులేకుండా మాజీ సీఎం హోదాలో ఏమిటా మాటలు? దద్దమ్మలు, సన్నాసులు అంటే చూస్తూ ఊరుకోం. నువ్వు దోపిడీ చేసిన సొమ్మును కక్కించి వాటితోనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాం' అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవలేని బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు కేంద్రమంత్రి ఎలా అవుతారు? ఏ పార్టీ నుంచి అవుతారు? అని ప్రశ్నించారు.

దేశ సంపదను ప్రధాని నరేంద్రమోదీ పెట్టుబడిదారులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ ఉండదన్నారు. కారు షెడ్డు నుంచి ఇక బయటకు రాదన్నారు. ఓట్లు అడగడం వరకే కాదని, కాంగ్రెస్ గతంలో ఎలా సేవ చేసిందో భవిష్యత్తులో కూడా అలాగే చేస్తుందని హామీ ఇచ్చారు.

ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పులమయం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామన్నారు. తాము ఇప్పటికే 65 లక్షల మందికి రైతుబంధు ఇస్తే... ఇవ్వలేదంటూ కాకి అరిచినట్లు అరుస్తున్నారని బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. అబద్దాల పునాదుల మీద బ్రతికిన కేసీఆర్ లక్ష్యం మాపై బురదజల్లడమేనని విమర్శించారు. రూ.1400 కోట్లతో ప్రాజెక్టులు కట్టి చుక్క నీరు రాకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.
Go Back to Shorts
Mallu Bhatti Vikramarka
BRS
Telangana
Lok Sabha Polls

More Telugu News