ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
- గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి జైలుశిక్ష
- నాడు విచారణ అధికారిగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ
- తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న లక్ష్మీనారాయణ
- విశాఖ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు
తనకు ప్రాణహాని ఉందంటూ లక్ష్మీనారాయణ విశాఖ పోలీస్ కమిషనర్ కు ఇవాళ ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు తెలుస్తోంది.
గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి తదితరులు జైలుకు వెళ్లడం తెలిసిందే. అప్పుడు విచారణ అధికారిగా ఉన్నది లక్ష్మీనారాయణే.
ఈ నేపథ్యంలో, ఇవాళ విశాఖ సీపీని కలిసిన లక్ష్మీనారాయణ... విశాఖలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.